Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం

2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొంది. అయితే, తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఈ పని చేసినట్లుగా ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేసింది.
2021లో ఆ లాకర్ను మూడు చోట్లకు మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సెయింట్ మేరీస్ రోడ్డు (St Marys Road)లో ఉన్న తన అపార్ట్ మెంట్ లోనే ఉందని.. ఆ తర్వాత సీఐటీ నగర్ (CIT Nagar)లోని తన మాజీ భర్త ధనుష్ (Dhanush) ఫ్లాట్కు మార్చినట్లుగా పేర్కొంది. మళ్లీ అక్కడి నుంచి 2021 సెప్టెంబర్లో తిరిగి సెయింట్ మేరీస్ రోడ్డులో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకే చేర్చానని తెలిపింది. 2022 ఏప్రిల్లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ (Poes Garden ) ఇంటికి షిప్ట్ చేసినట్లు ఐశ్వర్య ఫిర్యాదులో వివరించింది. ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు తన అపార్ట్ మెంట్ లోనే స్టీల్ కప్ బోర్డులో ఉండేవని.. అవి తన ఇంట్లో పనిచేసే సిబ్బందికి తెలుసని తెలిపింది.
అయితే 2023 ఫిబ్రవరి 10న తన లాకర్ను ఓపెన్ చేసి చూడగా.. అందులోని కొన్ని నగలు, డైమండ్లు కనిపించలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాకైనట్లు తెలిపింది. రూ.3.60 లక్షల విలువైన డైమండ్ సెట్స్ (Diamond sets), పురాతన బంగారు ముక్కలు (antique gold pieces), నవరత్న సెట్స్ (Navaratnam sets), గాజులు (bangles) ఇలా సుమారు 60 సవర్ల (60 sovereigns) బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకట్పై అనుమానం వ్యక్తం చేసింది. ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.